Monday, February 27, 2012

శ్రీరామరాజ్యం



బాపు దర్శకత్వం లో ,యలమంచలి సాయిబాబు నిర్మించిన "శ్రీరామరాజ్యం" ను నేను ఈ మధ్యే చూసాను . అప్పటికే వూరువాడా అంతా ఈ సినిమా గురించే మోగిపోతోంది . ఈ మధ్య కాలం లో ఇలాంటి చూడతగ్గ సినిమా రాలేదు . మా మనవరాలిని , మనవడి ని కూడా తీసుకెళ్ళాను . వాళ్ళకు అందులోని బాలహనుమాన్ , లవకుశ లు తెగ నచ్చేసారు .నాకూ నచ్చారనుకోండి . సినిమా చూడక ముందు , శ్రీరాముడి గా బాలకృష్ణ బాగుంటాడనే అనుకున్నాను . సీతమ్మవారిగా నయనతారదే కొంచం డౌట్ గా వుండింది . కాకపోతే ఓసారి బాపూబొమ్మగా బాపూ చేతిలో ఢోకా వుండకపోవచ్చు అనుకున్నాను . అలగాగే 90 శాతం పరవాలేదు .కాకపోతే స్నేహ కాని , వేద కాని వున్నట్లైతే ఇంకా బాగుండేవారేమో అని అనిపించకపోలేదు . అలాగే బాలకృష్ణకు మేకప్ ఇంకొంచం బాగావేసి వుండవలిసింది అనిపించింది . పిల్లలు ముగ్గురే కాదు ఆశ్రమం లోని పిల్లలంతా చాలా ముద్దుగా వున్నారు . మిగితా నటీనటులు కూడా వారి వారి పాత్రలను బాగానే పోషించారు . మొత్తం మీద సినిమా బాగానే అనిపించింది .

మేము సినిమా చూసి బయటకు రాగానే అక్కడ బాలకృష్ణ , నయనతారల ఫొటోకు ఒకావిడ అగరొత్తులు వెలిగించి దండం పెట్టటం కనిపించింది . ఇహ మా అమ్మాయిని చూసుకోండి ఒహటే నవ్వు . తనను చూసి పిల్లలు నవ్వులే నవ్వులు .వాళ్ళను చూసి , నేను ,శ్రీలలితగారు , వారి చెల్లెలు నవ్వీ నవ్వీ అలిసిపోయాము . ఇప్పుడేమి చూసారమ్మా , "లవకుశ" వచ్చిన రోజులలో ఐతే అంజలీదేవికి ఆడవాళ్ళందరూ పడీ పడీ దండాలు పెట్టేవారు , యన్ టీఅర్ ను , అంజలిదేవిని సీతారాముల లాగానే కొలిచారు అని శ్రీలలితగారు మా అమ్మాయికిచెప్పారు . పిల్లలంతా ఓగాడ్ అంటూ నవ్వలేక అలిసిపోయారు :)

ఈ సినిమా రచయతలు బాపు . ముళ్ళపూడి వెంకటరమణ.

సినిమాటోగ్రాఫీ;పి.ఆర్.కె రాజు .

సంగీతం ; ఇళయరాజా .

గాయనీ గాయకులు ;

యస్.పి బాలాసుబ్రమణ్యం ,
శ్రేయాఘోష్ ,
శ్వేతామోహన్,
కెయస్ చిత్ర,
సురభిశ్రావణి ,
శ్రీరాం పార్థసారధి,
అనిత,
కీర్తన